పల్లెటూరి నేపథ్యం, మరదళ్ల అమాయకపు ప్రేమ, మట్టిపై మక్కువ.. ఇవన్నీ కలిస్తే వచ్చే స్వచ్ఛమైన కథే ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి ప్రధాన పాత్రల్లో దర్శకుడు ధనరాజ్ లెక్కల తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా ఈరోజు (జూలై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, రైతు గొప్పదనాన్ని చాటిచెప్పేలా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
కథ:
నాగనూరు, లచ్చక్క పేట అనే రెండు గ్రామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చదువు అంటే ఆమడదూరం పారిపోయే శివ (అభినవ్ మణికంఠ) వ్యవసాయాన్ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాస్త కోపం ఎక్కువైన ఈ ఊరి కుర్రాడిని తన ఇద్దరు మరదళ్లు చిట్టి (దివిజ ప్రభాకర్), పొట్టి (తన్మయ్ ఖుషి) విపరీతంగా ఇష్టపడతారు. అయితే శివ, చిట్టిల మధ్య చిన్నప్పటి నుంచే బలమైన ప్రేమ ఉంటుంది. తీరా పెళ్లికి వచ్చేసరికి వ్యవసాయం చేసేవాడికి, కనీసం డిగ్రీ కూడా పాస్ కాని వాడికి తన కూతురిని ఇవ్వనని చిట్టి తండ్రి తెగేసి చెబుతాడు. ఉద్యోగం ఉంటేనే విలువా? వ్యవసాయం చేసే రైతుకు విలువుండదా? ఈ క్రమంలో శివ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? ఈ ప్రేమకథ రెండు ఊర్ల మధ్య ఎలాంటి పంచాయితీకి దారితీసింది? ఇందులో రాజన్న (దేవి ప్రసాద్), కల్లు మామల పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా, క్రమంగా పల్లెటూరి వాతావరణంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడంలో దర్శకుడు సఫలమయ్యాడు. వినాయక చవితి పండగ సందడి, స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు, బావామరదళ్ల క్యూట్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ను ఎంగేజింగ్గా మారుస్తాయి. రౌడీ గ్యాంగ్ తో గొడవ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక అనూహ్యమైన నైఫ్ స్టాబింగ్ సీన్ సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీని రేకెత్తిస్తాయి.
ద్వితీయార్థంలో సినిమా మరింత ఎమోషనల్గా మారుతుంది. జైలు నుండి తిరిగి వచ్చిన హీరో పట్ల ఊరి వారి ప్రవర్తన, తన మరదలి నిశ్చితార్థం ఆపడానికి హీరో పడే తపన డ్రామాను రక్తికట్టిస్తాయి. ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్. రైతు పడే కష్టాన్ని, వ్యవసాయం ప్రాముఖ్యతను దర్శకుడు ధనరాజ్ లెక్కల చాలా హృద్యంగా చూపించాడు. ఎలాంటి అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసే క్లీన్ ఎంటర్టైనర్గా దీన్ని మలిచారు.
నటీ నటుల పనితీరు:
అభినవ్ మణికంఠ: శివ పాత్రలో అభినవ్ ఒదిగిపోయాడు. పల్లెటూరి యువకుడిగా, బీపీ (అగ్రెసివ్ నేచర్) ఉన్నవాడిగా తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు.
దివిజ, తన్మయ్: మరదళ్లుగా నటించిన వీరిద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమ క్యూట్ నటనతో, సంభాషణలతో సినిమాకు ఫ్రెష్నెస్ తీసుకొచ్చారు.
ఇతర నటీనటులు: రాజన్నగా దేవి ప్రసాద్, అలాగే కల్లు మామ పాత్రలు కథను ఎమోషనల్ గా ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషించాయి. ఈటీవీ ప్రభాకర్ తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
సినిమాటోగ్రఫీ: ‘గరుడవేగ’ అంజి కెమెరా వర్క్ సినిమాకు పెద్ద అస్సెట్. పల్లెటూరి అందాలను, అక్కడి నేటివిటీని చాలా సహజంగా కెమెరాలో బంధించారు.
సంగీతం: చరణ్ అర్జున్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో వచ్చే నేపథ్య సంగీతం (BGM) సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది.
నిర్మాణం: ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మాణ విలువలు సినిమాను రిచ్గా చూపించాయి.
తుది తీర్పు….
‘హే చికీతా’ కేవలం ఒక రెగ్యులర్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాదు.. అంతకుమించి వ్యవసాయం ఇతివృత్తంగా సాగే ఒక మంచి వింటేజ్ విలేజ్ డ్రామా. ‘రైతే రాజు’ అనే బలమైన సందేశాన్ని చెబుతూనే, వినోదాన్ని పండించిన ఈ చిత్రాన్ని ఎలాంటి అసౌకర్యం లేకుండా కుటుంబసమేతంగా నిశ్చింతగా చూడొచ్చు!










