మంచి కంటెంట్ తో వస్తున్న “చిరంజీవి” సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది – గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో హీరో కికు యనమల
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా “చిరంజీవి”. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.”చిరంజీవి” సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఈ చిత్ర గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఆర్ట్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ – ఈ సినిమాకు డైరెక్టర్ వెంకట్ గారు అన్నీ తానై చూసుకున్నారు. అరకు, రంపచోడవరం వంటి లొకేషన్స్ లో కొన్ని చోట్ల సెట్స్ వేసి సినిమా చేశాం. “చిరంజీవి” మూవీ చాలా బాగా వచ్చింది. అన్నారు.
ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – డైరెక్టర్ వెంకట్ ఈ కథ నాకు చెప్పడానికి వచ్చాడు. సగం కథ విన్నాకే ఈ సినిమా ఎంత బాగా ఉండబోతోంది అనేది అర్థమైంది. అదే విషయం అతనికి చెప్పి మూవీకి నాకు వీలైనంత సపోర్ట్ అందిస్తానన్నాను. ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఉంటూ మీరు చూపు తిప్పుకోనంత ఎంగేజింగ్ గా “చిరంజీవి” సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ వెంకట్ ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టి సినిమాకు కావాల్సిన ఔట్ పుట్ తీసుకున్నాడు. ఇది గ్లింప్స్ అని మేము చెబుతున్నా..సినిమా గురించి ఇస్తున్న హింట్ అనుకోవచ్చు. ఇందులోనే కథలోని కాన్ ఫ్లిక్ట్ తెలుస్తుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ – నేను లవ్ స్టోరీస్, హారర్ మూవీస్ కు మ్యూజిక్ చేస్తుంటా గానీ ఫస్ట్ టైమ్ ఫుల్ యాక్షన్, రొమాన్స్ ఉన్న సినిమా “చిరంజీవి” చేశాను. ఈ సినిమా కథ విన్నప్పుడు కాన్సెప్ట్ బాగుందని అనిపించింది. అయితే బీజీఎం చేసేప్పుడు ఒక్కో సీన్ చూస్తుంటే ఇంత ఇంటెన్సిటీతో రూపొందిచారా అని ఆశ్చర్యపోయాను. క్లైమాక్స్ మాత్రం ఊహించలేకపోయాను. సినిమాలో ట్రిక్కీ ప్లే ఉంటుంది. అది చోటా గారు పర్పెక్ట్ గా ఎడిట్ చేశారు. కొత్తవాళ్లు చేసినట్లు సినిమా ఎక్కడా అనిపించలేదు. ఈ మూవీకి వర్క్ చేయడం ఎంజాయ్ చేశాను. అన్నారు.
నటుడు రాజీవ్ మాట్లాడుతూ – చిరంజీవి అనేది మెగాస్టార్ గారి పేరు. అన్నయ్య పేరు లాగే మా సినిమా కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా చిరంజీవి గారు చూస్తే మా టీమ్ ను పిలిచి అప్రిషియేట్ చేస్తారు. ప్రతి సీన్ గ్రిప్పింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా మీరు థియేటర్స్ లో ఫోన్స్ ముట్టుకోరు. ఎంతో కష్టపడి మేమంతా చేసిన ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. అన్నారు.
నటుడు రామ్ జగన్ మాట్లాడుతూ – డైరెక్టర్ వెంకట్ ఈ కథ చెప్పిన దానికంటే చాలా బాగా మూవీ తెరకెక్కించాడు. సినిమా చూస్తున్నప్పుడు ఈ ట్విస్ట్ లు ఊహించలేదే అనిపించింది. ప్రొడ్యూసర్ దీప్తి గారు ఒక పెద్ద సినిమాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడలేదు. భరణి, గోపరాజు రమణ, ఈశ్వరీరావు,..ఇలా మేమంతా మంచి క్యారెక్టర్స్ చేశాం. మీడియా మిత్రులే మా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి మాట్లాడుతూ – నేను ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఒక మూవీకి తీసుకెళ్లి, ఇంటర్వెల్ కు ముందే బయటకు తీసుకొచ్చారు. ఆ సినిమా నేను చూడొద్దని ఆయన అనుకున్నారు. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నన్ను సినిమా ఎప్పుడూ ఆకర్షించేది. ఎవరిదో ఒక కథను మనం రెండున్నర గంటల పాటు చూస్తూ ఓన్ చేసుకుంటాం. సినిమా మీద ఉన్న ప్యాషన్ నన్ను ప్రొడ్యూసర్ గా ఈ వేదిక మీదకు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక బాధ్యతతో “చిరంజీవి” సినిమా చేశాను. బలమైన కథ, క్యారెక్టర్స్ తో ఈ సినిమాను నిర్మించాం. మా మూవీ ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. మీరంతా మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
డైరెక్టర్ శుభ సాయి వెంకట్ మాట్లాడుతూ – ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ అన్న జాయిన్ కావడంతో మా మూవీ పాజిటివ్ గా స్టార్ట్ అయ్యింది. ఆయన మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి) అనే పాయింట్ చుట్టూ డ్రామా అల్లుకున్న కథతో ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం. కికు యనమల లీడ్ రోల్ చేశాడు ఆయన కొత్త హీరో అని ఎక్కడా అనిపించదు. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ఇరగదీశాడు. కశిష్ కొత్త అయినా చాలా బాగా నటించింది. ఎందరో సీనియర్స్ తో కలిసి మేము కొత్త వాళ్లం ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా మూవీకి ప్రొడ్యూసర్స్ రియల్ హీరోలు అని చెప్పుకోవచ్చు. వాళ్లు ఇచ్చిన సపోర్ట్, సినిమా మీద వాళ్లకు ఉన్న ప్యాషన్ వల్లే మా సినిమాను ఇక్కడిదాకా తీసుకురాగలిగాం. మా “చిరంజీవి” సినిమాను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
హీరో కికు యనమల మాట్లాడుతూ – నాకు ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. తెలుగు అబ్బాయిని. సినిమా మీద ప్యాషన్ తో నటన మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను. “చిరంజీవి” సినిమాతో మీకు పరిచయమవుతున్నా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ సినిమా చేసేప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు. ఇండస్ట్రీలో కొత్తవాళ్లకు సపోర్ట్ ఉంటుందో ఉండదో అని సినిమాలు వద్దు అని చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు గుండె ధైర్యం ఉంటే చాలు అనిపించింది. ఆ గుండె కుడి వైపు ఉందా, ఎడమ వైపు ఉందా అనేది సమస్య కాదు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్లకు ధైర్యం పెరగాలని ఇదంతా చెబుతున్నాను. ఈ కాన్సెప్ట్ పెద్ద హీరో అయితే బాగుంటుందని కొందరు సజెస్ట్ చేశారు. అయితే స్టార్స్ తో సినిమా చేయడం అంత సులువు కాదు. ఈ రోజు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. కొత్త వాళ్లా స్టార్సా అనేది చూడటం లేదు. పరభాషా చిత్రాలను కూడా హిట్ చేస్తున్నారు. మా మావీ కంటెంట్ చాలా బాగుంది. కొత్త వాళ్లైనా బాగా తెరకెక్కించారే, బాగా పర్ ఫార్మ్ చేశారే అనేలా మా సినిమా ఉంటుంది. ఇకపైనా ఇలాంటి మంచి కంటెంట్ తో వస్తూనే ఉంటాం. అన్నారు.










